రేవంత్ రెడ్డిది కొడంగల్ కాదు.. వలస వచ్చారు: డీకే అరుణ

  • నియోజకవర్గ ప్రజలపై రేవంత్ కక్ష కట్టారన్న అరుణ
  • లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
  • పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయారని వ్యాఖ్య
లగచర్ల ఘటన తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. తాజాగా ఈ అంశంపై డీకే అరుణ మాట్లాడుతూ, లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వబోమని గత 8 నెలలుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. బలవంతంగా భూములు లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారని, ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారని చెప్పారు. రేవంత్ రెడ్డి సోదరుడు అక్కడున్న రైతులను భయపెట్టారని, ఎలాగైనా భూములను గుంజుకుంటామని చెప్పారని మండిపడ్డారు. కలెక్టర్ పై దాడి ఘటన తర్వాత గ్రామాల్లోకి వచ్చిన పోలీసులు ఇష్టం వచ్చినట్టు దాడి చేశారని అన్నారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కొడంగల్ కాదని... వారు వలస వచ్చారని డీకే అరుణ చెప్పారు. రేవంత్ రెడ్డి సీఎం అయితే తమ నియోజకవర్గం బాగుంటుందని ప్రజలు గెలిపిస్తే... ఆయనేమో జనాలపై కక్ష కట్టారని దుయ్యబట్టారు. లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంతాలకు పోవద్దని, ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని సూచించారు. 

పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయారని... 11 నెలల సమయంలోనే మీరు పేదల ఉసురు పోసుకుంటున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి అహంకారాన్ని వీడాలని చెప్పారు. రైతులను ఒప్పించిన తర్వాతే భూములు తీసుకోవాలని అన్నారు.

DK Aruna
BJP
Revanth Reddy
Congress

More Telugu News